పెహల్గాం ఘటన దేశ ప్రజల్లో మార్పు తెచ్చింది.. కేంద్ర మంత్రి బండి సంజయ్

ఉగ్రవాద నిర్మూలనే మోదీ సర్కార్ లక్ష్యం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించాల్సిందే. పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఉగ్రవాద నిర్మూలనకు యుద్దంలో పాల్గొనేందుకు ప్రజలు సిద్దమయ్యారు. ఉగ్రవాద శిబిరాల ధ్వంసంతో దేశ సైనిక సత్తా ప్రపంచానికి తెలిసిందని యాంటీ టెర్రరిజం డే సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు..

పెహల్గాం ఘటన దేశ ప్రజల్లో మార్పు తెచ్చింది.. కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay

Updated on: May 21, 2025 | 10:20 AM

హైదరాబాద్, మే 21: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పెహల్గాం ఘటన తరువాత దేశ ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్దంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొనేందుకు సిద్దమయ్యారన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు. ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’ సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఏమన్నారంటే..

‘ప్రపంచంలో టెర్రరిజాన్ని అణిచివేసే శక్తి సామర్ధ్యాలు భారత్ కు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. పెహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం టెర్రరిస్టుల స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మన సైన్యం ధైర్య సాహసాలను చూశాం. పాకిస్తాన్ టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ ఆ దేశం ఆర్ధిక సాయం చేస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. ముంబయి పేలుళ్లు, లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ పేలుళ్లు, మక్కా మసీదు పేలుళ్ల తరువాత దేశ ప్రజల్లో మార్పులు వచ్చాయి. అవసరమైతే దేశం పక్షాన టెర్రరిజంపై యుద్దం చేసేందుకు సిద్దంగా ఉండటం సంతోషకరం’.

‘పాకిస్తాన్ భారత సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య ప్రజలను, వారి ఆవాసాలను టార్గెట్ చేసి ధ్వంసం చేయాలనుకుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని వాటిని తిప్పికొట్టిన ఘనత మన సైన్యానిదే. మోదీ నాయకత్వంలో అమిత్ షా సారధ్యంలో టెర్రరిజం ఏ రూపంలో అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సైన్యానికి మద్దతుగా నిలవడం దేశ భక్తికి నిదర్శనం. చిన్నా పెద్దా ముసలి ముతక తేడా లేకుండా టెర్రరిజం అంతం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మట్టుపెట్టాల్సిందే. ఇందులో మరో ఆలోచనే లేదు. యాంటీ టెర్రరిజం డే సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం వాళ్లు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉంది’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.