Video: పోయిన 2 రోజుల తర్వాత ఇంటిముందు ప్రత్యక్షమైన నక్లెస్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం ఓ ఇంట్లో దొంగిలించబడ్డ బంగారం అనూహ్యంగా ఇంటి ముందు ప్రత్యక్షమైంది. పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలో బంగారం ఇంటి ముందు ప్రత్యక్షమవడం చూసి బాధితులు, ఖాకీలు అంతా షాక్ అయ్యారు. ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందోనని తెగ ఆలోచిస్తున్నారు.

ఇంట్లో కనిపించకుండా పోయిన బంగారం రెండ్రోజుల తర్వాత ఇంటి వాకిట్లో దర్శనమిచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పాడ్ గ్రామంలో జరిగింది. గోలి వెంకటేశ్వర్లు అనేవ్యక్తి ఇంట్లో రెండున్నర తులాల బంగారు నక్లెస్ అపహరణకు గురయింది.
ఈ కుటుంబమంతా మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 18వ తేదీన బంగారు నక్లెస్ చోరీకి గురైంది. ఊరి నుంచి తిరిగివచ్చిన తర్వాత ఇంట్లో నెక్లెస్ కనిపించకపోవడంతో అవాక్కైనా కుటుంబ సభ్యులు.. తమ ఇంట్లో దొంగలు పడ్డారని భావించి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్గటారు.
అయితే విచారణ జరుపుతున్న క్రమంలో 20వ తేదీన బంగారం సడెన్గా బాధితుల ఇంటిముందు ప్రత్యక్షమైంది. ఇంట్లోని కుటుంబ సభ్యులు వాకిలి ఊడుస్తుండగా నక్లెస్ కనిపించింది. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. బంగారం తిరిగి లభించడంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ బంగారం చోరీ ఇంటి దొంగల పనా! లేక ఇరుగుపొరుగు వారు ఎవరైనా బంగారం చోరీచేసి.. కేసు అయిందనే భయంతో తిరిగి అక్కడ వదిలి వెళ్లారా! అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా విచారణ జరుపుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
