
విధి పగ పట్టిందో.. లేక ఆ కుటుంబంపై కాలం కనికరం చూపలేదో తెలియదు కానీ ఒక పచ్చని సంసారం చిన్నాభిన్నమైపోయింది. గ్యాస్ ప్రమాదం రూపంలో మొదలైన మృత్యుఘోష, ఆ ఇంటి దీపాన్ని పూర్తిగా ఆర్పేసింది. కళ్లముందే కన్నబిడ్డలు, తల్లిని కోల్పోయిన ఆ తండ్రి.. భార్య కూడా దూరమవడంతో మనోవేదన తట్టుకోలేక తనువు చాలించాడు. తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద గాథ స్థానికుల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.
గతేడాది ఏప్రిల్ 29న గుత్తికొండ వినోద్ ఇంట్లో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు వారి జీవితాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రమాదంలో వినోద్ తల్లి సుశీల, తన ఇద్దరు ప్రాణ సమానమైన బిడ్డలు తరుణ్, వరుణ్లతో పాటు మేనకోడలు కూడా మృత్యువాత పడ్డారు. కళ్లముందే రక్తసంబంధీకులు కాలిబూడిదవ్వడం ఆ దంపతులకు తీరని వేదన మిగిల్చింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన పిల్లలు లేరనే బాధ వినోద్ భార్య రేవతిని కుంగదీసింది. ఆ మనోవేదనతో గతేడాది డిసెంబర్ 22న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చేతికి అందొచ్చిన పిల్లలు, తోడుండాల్సిన భార్య.. ఇలా అందరూ మృత్యుఒడికి చేరడంతో వినోద్ అనాథగా మిగిలిపోయాడు.
నా అనుకున్న వారందరూ వెళ్లిపోయారు.. ఇక నేనెందుకు?” అనే శూన్యం అతడిని వెంటాడింది.కుటుంబంలో ఎవరూ లేరన్న తీవ్ర మనస్థాపంతో ఈనెల 7న వినోద్ తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మృత్యువుతో పోరాడి వినోద్ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం కాల గర్భంలో కలిసిపోయింది. ఒకప్పుడు పిల్లల అల్లరితో, నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన అందరూ మరణించడంతో పాత మిట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..