Watch: క్లాస్ జరుగుతుండగా అనుకోని అతిథి సడన్ ఎంట్రీ.. పరుగులు తీసిన విద్యార్థులు

హైదరాబాద్ శివారు కీసరలోని సెరినిటీ పాఠశాలలో పదో తరగతి గదిలోకి నాగుపాము ప్రవేశించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ వచ్చే వరకు 45 నిమిషాలు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఇది మూడోసారి కావడంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల భద్రత, పరిశుభ్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Watch: క్లాస్ జరుగుతుండగా అనుకోని అతిథి సడన్ ఎంట్రీ.. పరుగులు తీసిన విద్యార్థులు
Keesara School Cobra Scare

Updated on: Sep 08, 2026 | 3:16 PM

మేడ్చల్‌ జిల్లా: కీసరలోని సెరినిటీ స్కూల్‌లో నాగుపాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని మూడో అంతస్తులో ఉన్న పదో తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీచర్‌ క్లాస్ నిర్వహిస్తున్న సమయంలో గదిలోకి నాగుపాము రావడాన్ని విద్యార్థులు గమనించారు. పామును చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

45 నిమిషాల పాటు బయటే విద్యార్థులు

పాము తరగతి గదిలోకి వచ్చిన విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. పామును పట్టుకునేందుకు స్నేక్‌ క్యాచర్‌ వచ్చే వరకు విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపించారు. అయితే స్నేక్‌ క్యాచర్‌ రావడానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టింది. దీంతో ఆ సమయంలో విద్యార్థులు పాఠశాల బయటే వేచి ఉండాల్సి వచ్చింది. స్నేక్‌ క్యాచర్‌ వచ్చి పామును పట్టుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

తల్లిదండ్రుల్లో ఆగ్రహం

ఈ ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలోకి నాగుపాము రావడం ఇది మూడోసారి అని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత, భద్రతా చర్యలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల పరిసరాల్లో పొదలు, చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా పాఠశాల యాజమాన్యం తగిన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలో విద్యార్థుల భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నాగుపాము తరచూ పాఠశాల పరిసరాల్లోకి వస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us