
ఇటీవలే హైదరాబాద్ పరిధిలోని నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, లబ్ధిదారులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. వచ్చే నెల 15 నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, వారికి ఇళ్ల మంజూరు పత్రాలను అందించాలని హౌసింగ్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. అంతేకాదు, వచ్చే ఏడాది మార్చి నాటికి 2.5 లక్షల ఇళ్ల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. హైదరాబాద్ పరిధిలోని 16 నియోజకవర్గాలు మినహా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 2,500 ఇళ్లను నిర్మించనుంది.
లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 50 వేల మంది సొంత ఇళ్లు లేక గుడిసెల్లో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో రెండో విడతలో వీరికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని హౌసింగ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బండల ఇళ్లు, రేకుల ఇళ్లలో నివసించే వారికి పైకప్పు (స్లాబ్) నిర్మించి ఇచ్చేందుకు ‘రూఫ్ పునఃప్రారంభం’ అనే మరో కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చింది.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 70 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. వీటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ పూర్తైన తర్వాత లబ్ధిదారుల జాబితా జిల్లా కలెక్టర్ల వద్దకు చేరుతుంది. కలెక్టర్లు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్థానిక ఇన్ఛార్జ్ మంత్రికి అందజేస్తారు. మంత్రి నుంచి ఆమోదం లభించిన తర్వాత అధికారులు లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. మొత్తంగా రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం, వీటి నిర్మాణం కోసం రూ.10,400 కోట్లను కేటాయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.