
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ శుభవార్త అందించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ తర్వాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షలమంది దరఖాస్తు చేసుకోగా.. విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. తొలి విడతగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. రెండో విడత జాబితా కోసం లక్షలమంది ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. కొత్త జిల్లాలపై జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లాను తమ ప్రభుత్వం రద్దు చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జిల్లాలను రద్దు చేసే ఆలోచన తమకు లేదని స్పష్టతిచ్చారు. ఉన్న జిల్లాలను తొలగించే ఆలోచన లేదని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని భావిస్తే ప్రజలతో చర్చించే చేస్తామని, భూపాలపల్లి జిల్లా ఎక్కడి పోదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైనా డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందా? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితకు మాత్రం ఫామ్హౌస్లు వచ్చాయని విమర్శించారు. దక్షిణ కుంభమేళాగా సమ్మక్క సారలమ్మ జాతరను జరుపుకున్నామని, రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అట్టాహాసంగా నిర్వహించామన్నారు.
కేసీఆర్, మోదీని చూసి ఓటేయాలని బీఆర్ఎస్, బీజేపీ అడుగుతున్నాయని, గల్లీలో వచ్చే సమస్యలను కూడా మోదీ వచ్చి తీరుస్తారా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. మన వారిని గెలిపిస్తే ఇక్కడే ఉంటారని, మన సమస్యలు తీరుస్తారని అన్నారు. కేసీఆర్, మోదీని చూసి ఓటేస్తే మోసపోతారని, తాము రెండేళ్లల్లో మున్సిపాలిటీలకు రూ.17,442 కోట్లు ఇచ్చామన్నారు. 2004-14 కాలంలో తాము 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇచ్చామని, గత 5 ఏళ్లల్లో ఎవరికైనా ఇల్లు వచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు పేదల పట్ల ఎలాంటి పట్టింపు లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో ఓట్లన్నీ కాంగ్రెస్కు వస్తాయని అనాడే చెప్పానని, ఇప్పుడు అది నిజమైందని తెలిపారు.