CM Revanth Reddy: ‘అంకెల గారడీ వద్దు.. వాస్తవ లెక్కలు ప్రజల ముందుంచాలి’.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

|

Dec 29, 2023 | 4:03 PM

అంకెల గారడీ వద్దు.. వాస్తవ లెక్కలు ప్రజల ముందు ఉండేలా బడ్జెట్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పన్నులు కట్టే ప్రజల ముందు వాస్తవ పద్దులు ఉంచాలనేదే తమ ఉద్దేశం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ఆర్థికశాఖ రివ్యూలో అధికారులకు సూచించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy: అంకెల గారడీ వద్దు.. వాస్తవ లెక్కలు ప్రజల ముందుంచాలి.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Cm Revanth Reddy
Follow us on

అంకెల గారడీ వద్దు.. వాస్తవ లెక్కలు ప్రజల ముందు ఉండేలా బడ్జెట్ తయారుచేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. పన్నులు కట్టే ప్రజల ముందు వాస్తవ పద్దులు ఉంచాలనేదే తమ ఉద్దేశం అంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ఆర్థికశాఖ రివ్యూలో అధికారులకు సూచించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, ఆరు గ్యారంటీల అమలు, చేయాల్సిన పనులకు.. ఎంత ఖర్చవుతుందనేది పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల వాస్తవికత ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపర్చాల్సిన పనిలేదనీ.. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..