
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. ఈ వివరాల ప్రకారం.. ద్రోణి ఒకటి బీహార్ ప్రాంతం నుండి ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా మరాత్వాడ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈరోజు ఏర్పడినట్లు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.
ఈ క్రమంలో రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ప్రస్తుతం ఉన్న స్థాయిలో కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. వాతావరణానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అటు ఏపీలో వాతావరణంపై ఐఎండీ కీలక ప్రకటన జారీ చేసింది. కోస్తా కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ /నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అంచనా వేసింది. ఈ క్రమంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఇవాళ కొన్నిచోట్ల జల్లులు కురిసే అవకాశముండగా.. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశముందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తరువాత 4 రోజుల్లో 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట్ర స్థాయిలో పెరుగుతన్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది. మార్చిలోనే ఎండలు తీవ్రరూపం దాల్చుతుండగా.. మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్ నాటికి తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. ఎండ వేడితో పాటు ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావడం లేదు.