Heat Wave: వామ్మో.. వాయ్యో.. మాడుపగిలే ఎండలు ముందున్నాయంట.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

|

Apr 17, 2024 | 4:48 PM

వడగాడ్పులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే.. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపునులు అంచనా వేస్తున్నారు. కాగా.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Heat Wave: వామ్మో.. వాయ్యో.. మాడుపగిలే ఎండలు ముందున్నాయంట.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Heat Wave
Follow us on

వడగాడ్పులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే.. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపునులు అంచనా వేస్తున్నారు. కాగా.. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత కూడా పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు సైతం వాహనాలు రాకపోకలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణశాఖ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం.. తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుఅవుతుండగా.. ఈ మూడు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం బుధవారం ప్రకటించింది. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గురువారం… కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు.. వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

ఏపీలో..

కాగా.. ఏపీలో కూడా ఎండలు మండుతున్నాయి. వడగాలులతో జనం అల్లాడుతున్నారు. దీంతో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు పేర్కొంది.

మోస్తరు వర్షాలు..

ఇదిలాఉంటే.. ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి.. మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..