తెలంగాణలో కలకలం రేపుతోన్న ఐఏఎస్ వీఆర్ఎస్.. అసలు కారణం అదేనా?

తెలంగాణ ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణచేశారు. వీఆర్‌ఎస్‌కు ఆయన పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. అక్టోబర్ 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

తెలంగాణలో కలకలం రేపుతోన్న ఐఏఎస్ వీఆర్ఎస్.. అసలు కారణం అదేనా?
Jupally Krishna Rao, Syed Ali Murtaza Rizvi

Updated on: Oct 23, 2025 | 5:10 PM

ఓవైపు ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్‌.. మరోవైపు కీలక మంత్రి లేఖ తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. తెలంగాణ ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణచేశారు. వీఆర్‌ఎస్‌కు ఆయన పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. అక్టోబర్ 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిజాయతీగా పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న రిజ్వీకి.. మరో పదేళ్లపాటు సర్వీసు ఉంది. భవిష్యత్తులో కేంద్ర కార్యదర్శి, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశం కూడా ఉంది. అయినా కూడా ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేయడం.. ప్రభుత్వం ఆమోదించడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రిజ్వీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీఎస్‌కు రాసి లేఖ బయటపడ్డం కలకలం రేపుతోంది.

-సీఎస్‌కు రాసిన లేఖలో రిజ్వీపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని జూపల్లి ఆరోపించారు. హైసెక్యూర్డ్ లేబుల్స్ కోసం కొత్త సాంకేతికతతో టెండర్లు పిలవాలని ఆదేశించినా కూడా రిజ్వీ పాత కంపెనీకే అవకాశం కల్పించారన్నారు ఆరోపించారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి చట్టవిరుద్ధంగా 6 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయన్నారు. లిక్కర్ సంస్థలకు అనుమతుల జాప్యంతో ఉత్పత్తి తగ్గి రాష్ట్రానికి 223 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు మంత్రి. రికార్డులు ఇవ్వమని అడిగితే నివేదికల పేరుతో రిజ్వీ జాప్యం చేశారన్నారు. TGBCL ఎండీకి అవసరమైన వివరాలు రిజ్వీ ఇవ్వలేదని.. ABD లిమిటెడ్ మద్యం ఉత్పత్తి, ధర నిర్ణయంలో జాప్యం కారణంగా భారీ నష్టం వాటినట్లు మంత్రి చెప్తున్నారు. రిజ్వీ VRS దరఖాస్తును తిరస్కరించాలని సీఎస్‌ను కోరిన జూపల్లి.. అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి రాసిన లేఖ.. తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. మంత్రి జూపల్లి ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం. మరోవైపు సీఎం రేవంత్‌ దృష్టికి కూడా IAS రిజ్వీ వ్యవహారం వెళ్లినట్టు తెలుస్తోంది. విచారణ ప్రారంభమైతే కేసులో ఇరుక్కుంటాననే అనుమానంతోనే రిజ్వీ VRSకి దరఖాస్తు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు జూపల్లి, రిజ్వీ ఎపిసోడ్‌పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీ రామారావు. 500కోట్ల రూపాయల టెండర్ వ్యవహారంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య నలిగిపోయే రిజ్వీ VRSకి అప్లై చేసుకున్నారని ఆరోపించారు.

మరోవైపు ఐఏఎస్‌ అధికారులను వేధించడం సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌. రిజ్వీ ఎందుకు వీఆర్‌ఎస్‌కి అప్లై చేశారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రుల ఒత్తిడికి లొంగకపోతే వాళ్లను వేధిస్తారా.. బలిచేస్తారా అంటూ మండిపడ్డారు లక్ష్మణ్. రిజ్వీ VRS వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవేళ రిజ్వీ తప్పుచేసి ఉంటే ఇన్ని రోజులూ ఎందుకు మాట్లాడలేదని బీజేపీ MP లక్ష్మణ్ రేవంత్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..