
ఒకప్పుడు వీకెండ్ అంటే పబ్బు గబ్బుండేది. కానీ ఇప్పుడు వీకెండ్ సరదా ఊరిచివర ఫాంహౌస్లకు చేరింది. పబ్బుల్లో ఏముంటది డీజే హోరు తప్ప.. అదే ఫాంహౌస్లో అయితే ఆకిక్కేవేరప్పా అన్నట్టుగా ట్రెండ్ను సెట్ చేశారు. మందు, విందు , చిందు వరకైతే సరే.. కానీ హద్దులు దాటి డ్రగ్స్వరకూ పోతోంది పోకడ. అంతటితో ఆగడం లేదు.. డ్రగ్స్ సేవనం, అసభ్య నృత్యాలు, కోడి పందాలు, కిడ్నాప్లు, చివరకు మర్డర్ల దాకా వెళ్లింది. ఫాంహౌస్లను బుక్ చేయడం, పీకలదాకా పట్టించడం, తెల్లారేదాకా మత్తులో తేలిపోవడం. ఇదే జరుగుతోంది. చివరకు రాజకీయనాయకులదీ ఇదే యవ్వారం.
రాత్రయితే చాలు, కొన్ని ఫామ్హౌస్ల వద్ద కార్ల క్యూలు కనిపిస్తాయి. బయటకు ప్రశాంతంగా కనిపించే గేట్లు… లోపల మాత్రం హై వోల్టేజ్ పార్టీలతో డీజే సౌండ్లతో హోరెత్తుతున్నాయి. మ్యూజిక్ సౌండ్స్, లైటింగ్, మద్యం, వీటి మధ్యలో డ్రగ్స్..ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఫామ్హౌస్ను ఒక రాత్రి అద్దెకు తీసుకోవడం… తర్వాత సోషల్ మీడియా ద్వారా గెస్ట్లను ఆహ్వానించడం… ఎంట్రీకి భారీ ఫీజులు వసూలు చేయడం. ఒక్క రాత్రికే లక్షదాకా అద్దె వస్తుండడంతో యజమానులు కూడా పార్టీలకు ఇచ్చేందుకే ప్రయార్టీ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా “పార్టీ ఫామ్హౌస్”ల పేరుతో ఫేమ్ అయ్యాయి. వీకెండ్స్లో యువతంతా అక్కడికి వెళ్లే ట్రెండ్ పెరిగింది.
రాజధాని పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫామ్హౌస్లను మినహాయిస్తే రంగారెడ్డి జిల్లాలోని 900 ఫామ్హౌస్లు ఉన్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్హౌస్లున్నాయి. కొంతమంది వీటిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ముజ్రా పార్టీలు నిర్వహిస్తామంటూ పబ్లిక్గానే సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. శుక్ర, శనివారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పోలీసులు భయం లేకుండా చేస్తామంటూ అభయం కూడా ఇస్తున్నారు కొందరు. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఫాంహౌస్లపై కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపడదంటున్నారు స్థానికులు.