
అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడే అంబులెన్స్లను కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారు. వాటిని నడిపిస్తున్న డ్రైవర్లు, నిర్వాహకులు అంబులెన్స్ల ముసుగులో దందాలు చేస్తున్నారు. లోపల ఎవరు రోగులు లేకున్నా.. సైరన్ వేసుకుని ట్రాఫిక్ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో అంబులెన్స్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సైరన్ వేసుకొని కుక్కల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ను పోలీసులు పట్టుకున్నారు. హిమాయత్ నగర్ నుంచి మదినగూడ వైపు వెళ్తుండగా పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.
పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ పేరుతో.. లోపల ఎలాంటి రోగులు లేకున్నా.. సైరన్ వేసుకుని ఎంచక్కా వెళ్లిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించటంతో.. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో మిర్చి బజ్జి తినేందుకు అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసుకొని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కుక్కలను తీసుకెళ్తున్న అంబులెన్స్ను పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..