
ఎన్నికలు పూర్తయ్యాయి..ఇక అంతా ప్రశాంతమే అనుకుంటుండగా..గెలిచిన అభ్యర్థులకు కొత్త థ్రెట్ మొదలైంది. స్పూఫ్ కాల్స్తో ప్రజా ప్రతినిధులను కొంతమంది అగంతకులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. రాచకొండ పీఎస్ పరిథిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యపోయారు. టెక్నాలజీ ఉపయోగించి MLA పేరుతో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు మల్కాజిగిరి, నేరెడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో పలువురు BRS నేతలు ఫిర్యాదులు చేశారు. అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి, నేరెడ్మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్ రెడ్డి, గౌతమ్నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, పలువురు BRS నేతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీరంతా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అటు మల్కాజ్గిరి BRS MLA మర్రి రాజశేఖర్రెడ్డి కూడా ఈ వ్యవహారంపై రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్కు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి బెదిరించిన అగంతకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మర్రి రాజశేఖర్రెడ్డి గెలుపును జీర్ణించుకోలేక అపోజిషన్ వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ఓటమి పాలయ్యారు.