Telangana Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్‌.. కట్ చేస్తే, 27 మంది జైలుకు..

| Edited By: Shaik Madar Saheb

Oct 02, 2024 | 6:46 AM

రాజస్థాన్‌ నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పనిపట్టారు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు. దేశవ్యాప్తంగా 2వేలకు పైగా కేసుల్లో నిందితులుగా ఉన్న 27 మందిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పట్టుకొచ్చారు.

Telangana Police: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్‌.. కట్ చేస్తే, 27 మంది జైలుకు..
Telangana Police Operation
Follow us on

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. మొదటిసారి ఇతర రాష్ట్రానికి వెళ్లి భారీ స్థాయిలో సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరస్తుల ఉనికి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నుండి రాజస్థాన్‌కు వెళ్లిన ఏడు పోలీసు బృందాలు.. 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 2వేలకు పైగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుల జాబితాను సిద్ధం చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు.. పలు బృందాలుగా రాజస్థాన్‌కు వెళ్లారు. అయితే.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులకు రాజస్థాన్ పోలీసులు పెద్దగా సహకరించలేదు. అయినప్పటికీ.. 15 రోజులపాటు రాజస్థాన్‌లోని జైపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పట్టు వదలకుండా గాలించడంతో సైబర్ కేటుగాళ్లు ఎట్టకేలకు చిక్కారు. ఈ 27 మందిపై దేశవ్యాప్తంగా 2,223 కేసులు.. తెలంగాణలోనే 189 కేసులు ఉన్నాయన్నారు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్.

ఇక.. కొట్టేసిన డబ్బు మొత్తాన్ని దేశవ్యాప్తంగా పలు అకౌంట్లకు మళ్ళించినట్లు తెలిపారు శిఖా గోయల్.. ఇప్పటివరకు నేరస్తులు 11 కోట్ల రూపాయలకు పైగా సొమ్మును కాజేసినట్లు తెలిపారు. వివిధ అకౌంట్ల నుండి క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటించేశారు. ఈ క్రమంలో.. వీరిని వెనకుండి నడిపించిన ముఠా సభ్యుల కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. పట్టుబడినవారిలో ప్రభుత్వ ఉద్యోగులు, జిమ్ ట్రైనర్లు, హోటల్ నిర్వాహకులు, హోటల్లో వంట చేసేవారు.. ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telangana Police Operation

వీరి వెనకాల ఉండి నడిపించిన ముఠా సభ్యుల కోసం ఇంకా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచి తొమ్మిది కోట్ల రూపాయల సొమ్ము బాధితుల నుంచి కాజేసినట్లు తెలిపారు. వీరంతా వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతూ విదేశాల్లో ఉన్న సైబర్ మాఫియా కోసం వీరు పనిచేస్తూ కమిషన్లను అర్జిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నారు. జిమ్ ట్రైనర్లు హోటల్ నిర్వాహకులు, హోటల్లో వంట చేసేవారు ఇలా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే వీరిని పట్టుకునేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర పోలీసులు ధైర్యం చేయలేదు. అచ్చం సినిమాలో చూపించిన విధంగానే ఈ సైబర్ క్రిమినల్స్ ని పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు రాజస్థాన్ కు వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.. అక్కడ 15 రోజులపాటు ఎన్నో అవస్థలు పడి 27 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడ పిటి వారెంట్ మీద కోర్టులో ప్రొడ్యూస్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇక్కడ నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..