Telangana: సీఎం అభ్యర్ధిపై కీలక ప్రకటన.. సాయంత్రంలోపు సస్పెన్స్‌కు తెర..!

తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఇవాళే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశానికి AICC ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన DK శివకుమార్‌ - ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఖర్గేతో సమావేశం కానున్నారు.

Telangana: సీఎం అభ్యర్ధిపై కీలక ప్రకటన.. సాయంత్రంలోపు సస్పెన్స్‌కు తెర..!
Mallikarjun kharge

Updated on: Dec 05, 2023 | 11:56 AM

తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఇవాళే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశానికి AICC ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన DK శివకుమార్‌ – ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఖర్గేతో సమావేశం కానున్నారు. ఈ లోపు కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో భేటీ కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ తరపున ఎన్నికైన సభ్యుల అభిప్రాయాన్ని శివకుమార్‌ తెలుసుకున్నారు. అవన్నీ క్రోడికరించి ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు నివేదిక సమర్పించనున్నారు. సీఎం ఎంపికలో ఈ నివేదిక కీలకం కానుంది. సీనియర్‌ నేతలతో కూడా శివకుమార్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మరో వైపు సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకునేముందు పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ఖర్గే చర్చించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వమావేశం గురించి స్పష్టత లేదు. అలాగే తెలంగాణ సీనియర్‌ నాయకులు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించింది. ఇప్పటికే మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సీఎం రేసులో ఈ ఇద్దరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ వెర్షన్‌ను ఈ ఇద్దరు నాయకులు ఖర్గేకు వివరించే అవకాశం ఉంది.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే దానిపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిరాకరించారు. హైకమాండ్‌తో చర్చించేందుకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అడిగిన ప్రశ్నలు దేనికి కూడా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పందించలేదు. తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందని అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని, ఏం జరుగుతుందో చూద్దామని ఉత్తమ్‌ అన్నారు.