CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కీలక ప్రకటన.. వచ్చే మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు..

|

Oct 05, 2021 | 4:11 PM

దళితబంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు...

CM KCR On Dalithabandhu: దళితబంధుపై సీఎం కీలక ప్రకటన.. వచ్చే మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు..
Kcr
Follow us on

దళితబంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు. గతంలో సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం చేశామని గుర్తు చేశారు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ తెరాస ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. దళితబంధు పథకానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న కేసీఆర్.. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు కేటాయిస్తామని వెల్లడించారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేదేనని సీఎం కేసీఆర్​ తెలిపారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నట్లు చెప్పారు. దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందని.. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు. పరిస్థితుల మేరకు బడ్జెట్‌ అంచనాలు సవరించి నిధులు కేటాయించడం ఆనవాయితీ అని తెలిపారు. క్రమంగా 119 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలనే ఆలోచన తమకు ఉందని కేసీఆర్ తెలిపారు.

ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నామని.. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందని చెప్పారు. అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాంమని వెల్లడించారు. త్వరలో ఈ మండలాల్లో దళిత బంధు అమలు చేస్తామన్నారు.

75 ఏళ్ల స్వాతంత్య్రానికి తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ ఉజ్వలమైన పాత్ర పోషించారని కేసీఆర్​ కొనియాడారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం పార్లమెంట్‌కు ఉండేలా అంబేడ్కర్ రాజ్యాంగం రాశారని చెప్పారు. అంబేడ్కర్ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పరిపాలించలేదన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు.

Read Also..  KTR: నగర శివారు ప్రాంతాల్లో అండర్‎గ్రౌండ్ డ్రైనేజ్.. కౌన్సిల్‎లో కేటీఆర్..