
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. దాని వెనుక ఉన్న కుటుంబ కలహాలు.. ఇప్పుడు ఒక్కో ట్విస్ట్ బయటపడుతూ కేసును మరింత సంచలనంగా మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీతారాం, భార్య రేణుక ప్రవర్తనపై తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వివాహానికి ముందు, తర్వాత కొనసాగిన సంబంధాలు, సోషల్ మీడియాలో బయటపడిన ప్రైవేట్ వీడియోలు వంటి సంఘటనలు అతడిని మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నించినా పరిస్థితులు మారకపోవడంతో.. 19 పేజీల సూసైడ్ నోట్ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
ఆ సూసైడ్ నోట్లో తన బాధ, అవమానం, నమ్మకద్రోహం తాలూకా వివరాలు వివరంగా రాసి, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం ఈ కేసును మరింత వైరల్ చేసింది.
ఇంతవరకూ తెలిసిన కథ ఒకలా ఉంటే.. తాజాగా బయటపడిన ట్విస్ట్ మాత్రం అందరినీ షాక్కు గురి చేసింది. సీతారాం ఆత్మహత్య చేసుకుని నెల రోజులు కూడా గడవకముందే.. అతని భార్య రేణుక, తన ప్రియుడు రమణను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ బాచుపల్లి పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేసు మరింత మలుపు తిరిగింది. సీతారాం ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు, సంబంధాల నేపథ్యం, సోషల్ మీడియా కోణం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి.
తమ కొడుకు మరణానికి కారణమైన వారిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని సీతారాం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం వారు పోరాటం కొనసాగిస్తున్నారు. 2018లో వివాహం చేసుకున్న సీతారాం, రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబంగా మొదలైన ఈ జీవితం.. ఇప్పుడు విషాదాంతానికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో ఈ ఘటన మరోసారి తెలియజేస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.