Prof GN Saibaba: సోమవారం ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర.. ఆ తర్వాత డెడ్‌బాడీ గాంధీ ఆస్పత్రికి అప్పగింత

|

Oct 13, 2024 | 12:50 PM

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, విద్యావేత్త జీఎన్‌ సాయిబాబా అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయిబాబా కోరిక మేరకు గాంధీ ఆసుప్రతికి డెడ్‌బాడీని.. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి ఆయన రెండు కళ్లను డొనేట్ చేస్తున్నట్టు..

Prof GN Saibaba: సోమవారం ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర.. ఆ తర్వాత డెడ్‌బాడీ గాంధీ ఆస్పత్రికి అప్పగింత
GN Saibaba's Funeral procession
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, విద్యావేత్త జీఎన్‌ సాయిబాబా అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయిబాబా కోరిక మేరకు గాంధీ ఆసుప్రతికి డెడ్‌బాడీని.. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి ఆయన రెండు కళ్లను డొనేట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్ధం రేపు మౌలాలిలోని ఆయన నివాసంలో సాయిబాబా భౌతికకాయం ఉంచనున్నారు.

సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి అప్పగింత

నిమ్స్‌ మార్చురీ నుంచి సాయిబాబా భౌతిక కాయాన్ని అక్టోబర్‌ 14 ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి 9 గంటలకు గన్‌ పార్క్‌ చేరి అక్కడ.. పావుగంట ఉంచుతారు. అక్కడి నుంచి 10 గంటలకు మౌలాలి కమాన్‌ దగ్గర శ్రీనివాసా హైట్స్‌ చేరి అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చివరి ఊరేగింపు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీకి చేరుకుంటుంది. ఈ మేరకు ప్రొఫెసర్‌ సాయిబాబాకు చివరి శ్రద్ధాంజలి ఘటించే వారు ఆయా స్థలాల్లో ఎక్కడికైనా రావచ్చని కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జ‌న్మించిన సాయి బాబా.. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకి రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, అమలాపురంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుండి పీజీ ప‌ట్టా పుచ్చుకున్నారు. 2013లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఆయన ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ప‌ని చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. పదేళ్లపాటు జైలు శిక్ష తర్వాత 2024, మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి

అయితే 10 యేళ్ల జైలు జీవితంలో తాను ఎంతో కోల్పోయానని ఓ సందర్భంలో ఆయన అన్నారు. జైలులో చీక‌టి జీవితాన్ని అనుభ‌వించిన‌ట్లు తెలిపారు. జైలు అధికారులు తనను మానసికంగా వేధించారని తెలిపారు. వీల్‌చైర్ లేకుంటే నడవలేని తనను వీల్‌చైర్ తిరగని సెల్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే సెల్‌లో తనను ఉంచారని, జైలులోనే తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినట్లు ఎంతో ఆవేదన అనుభవించినట్లు తెలిపారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.