
ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగిసింది. మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా ఉన్న అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరితిరుపతి, మల్లా రాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. కీలక నేతలతో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణలో ప్రారంభమైన మావోయిస్ట్ ఉద్యమం..తెలంగాణలోనే చివరి దశకు చేరిందన్నారు డీజీపీ శివధర్రెడ్డి. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ లేదని.. కొందరు రిక్రూట్ అయినా బయటికి వచ్చేశారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన వాళ్లు 11 మంది మాత్రమే ఇంకా మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారని.. వాళ్లు కూడా అజ్ఞాతం వీడి లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
1983లో మావోయిస్ట్ పార్టీలో చేరిన దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి.. 43 ఏళ్ల తర్వాత అజ్ఞాతం వీడారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్న దేవ్జీ అనారోగ్యం కారణంగా జనజీవితంలోకి వచ్చానని చెప్పారు. తాను వ్యక్తిగత జీవితం కోసం ఉద్యమం నుండి బయటకు రాలేదని.. ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పార్లమెంటరీ సిస్టంలోకి వెళ్లాలనేది తన ఉద్దేశం కాదన్నారు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం..
గత రెండేళ్లలో మొత్తం 591 మంది మావోయిస్ట్లు ఉద్యమాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చారు. తమ పిలుపు మేరకు జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కుల కాపాడేందుకు ప్రయత్నిస్తామని..అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని డీజీపీ స్పష్టంచేశారు.
లొంగిపోయిన వారిలో సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన హేమాహేమీలు ఉన్నారు:
1. తిప్పరి తిరుపతి అలియాస్ దేవూజీ (62): పాలిట్బ్యూరో సభ్యుడు (PBM), సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్చార్జ్. గత 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి ‘అభయ్’గా ఈయనే వ్యవహరిస్తున్నారు.
2. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (76): సెంట్రల్ కమిటీ సభ్యుడు (CCM). గత 46 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు.
3. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (47): తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి. 28 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
4. నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న (62): రాష్ట్ర కమిటీ సభ్యుడు (SCM). 36 ఏళ్లుగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..