KTR: ఉపన్యాసాలు కాదు రూ.10వేల కోట్లు కావాలి.. ఓట్ల కోసం మతాల మధ్య విద్వేషాలు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ కామెంట్స్

| Edited By: Ravi Kiran

Sep 17, 2022 | 3:59 PM

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గతాన్ని తవ్వి మత...

KTR: ఉపన్యాసాలు కాదు రూ.10వేల కోట్లు కావాలి.. ఓట్ల కోసం మతాల మధ్య విద్వేషాలు.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ కామెంట్స్
Minister Ktr
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గతాన్ని తవ్వి మత పిచ్చిలేపే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎనిమిదేళ్లుగా గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఈ రోజే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రూ.పది వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కానీ వాస్తవానికి తెలంగాణకు (Telangana) ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కేవలం ఉపన్యాసాలు ఇచ్చి వెళ్లిపోతారని విమర్శించారు. ఇలాంటి వ్యవస్థల విషయంలో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగడంతో పాటు, దశాబ్దాల వెనక్కిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం హిందూ, ముస్లిం మతాల మధ్య కేంద్రం పంచాయతీ పెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. సమైక్యతా దినోత్సవం అంటుంటే.. వాళ్లు మాత్రం విమోచనం పేరుతో కలిసి ఉండొద్దని అంటున్నారని చెప్పారు. గతాన్ని తవ్వుకుని రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలని భావిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని అందించే ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. 2013 లో 29 లక్షల మందకి పింఛన్లు అందిస్తుంటే.. 2022 లో అది 40 లక్షలకు చేరిందని చెప్పారు.

తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 హాట్ టాపిక్ గా మారింది. ఆగష్టు 15 న దేశానికి స్వాతంత్య్రం వస్తే రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైదరాబాద్ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యతా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానికసంస్థల పరిధిలోని ఆఫీసులలో జాతీయజెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాధారణ సెలపు ప్రకటించారు. సెప్టెంబర్ 17 సందర్భంగా గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్‌లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్‌, సేవాలాల్ బంజారా భవన్ లను మధ్యాహ్నం సీఎం ప్రారంభిస్తారు. కళాకారులతో సీఎంకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.

భవనాల ప్రారంభం సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ, లంబాడీ, గోండు తదితర 33 రకాల కళారూపాలు ప్రదర్శించే కళాకారులు భారీ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆత్మీయసభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలను ఆహ్వానించారు. వారి రాక కోసం జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..