Hyderabad: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..

|

Feb 26, 2024 | 12:44 PM

మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 'మహాలక్ష్మీ' పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఈ స్కీంలోకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు ఇచ్చింది.

Hyderabad: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..
Gas Cylinder
Follow us on

మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ‘మహాలక్ష్మీ’ పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన రూ. 500కే గ్యాస్ సిలిండర్‌ను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఈ స్కీంలోకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న లబ్దిదారులను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు ఇచ్చింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందేనని.. ఆ తర్వాత రూ. 500 నగదు రీయింబర్స్ రూపంలో లబ్ధిదారుల అకౌంట్‌లలోకి బదిలీ చేస్తామని తెలిపింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా.. ఇందులో వినియోగదారుడు చెల్లించాల్సింది రూ.500, కేంద్ర రాయితీ రూ. 40 పోనూ, మిగతా రూ. 415ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ రూ.955 కాగా, అర్వపల్లిలో రూ. 974, మహబూబ్‌నగర్‌లో రూ. 958.50గా ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామం.. ఏ చోటైనా సిలిండర్ ఛార్జీల్లో తేడాలు ఉంటాయి. రవాణా ఛార్జీల వ్యత్సాసమే ఇందుకు కారణం. ఇక రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉండగా.. వారందరినీ కూడా మహాలక్ష్మీ పథకంలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీరికి కేంద్రం నుంచి ప్రతి సిలిండర్‌కు రూ.340 రాయితీ లభిస్తోంది. ఈ రాయితీ పోనూ.. మిగతా మొత్తం, అదనంగా రవాణా ఛార్జీలు కూడా పడకుండా.. ఆ డబ్బునంతా ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 కాగా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్దిదారుడు గ్యాస్‌కు చెల్లించాల్సింది రూ. 500, ఇక మిగిలిన దానిలో కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ. 340 వస్తే.. మిగతా రూ. 115ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా చెల్లిస్తుంది. కాగా, ఆదివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది పౌరసరఫరాల శాఖ. అలాగే పథకంలో భాగంగా రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: ఆ యువ ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే.! బీసీసీఐ వార్నింగ్ సిగ్నల్స్.. కాపాడటానికి ధోని కూడా లేడుగా.!