
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, నానక్రామ్ గూడా మధ్య రాపోకలు సాగించే ప్రయాణికులకు ఇదో బిగ్ అలర్ట్. ఇకపై ఈ రూట్లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్టు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద నిర్మాణ పనులు మొదలవడంతో, ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జంక్షన్ వైపు వచ్చే వాహనాలపై పరిమితులు విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, కొండాపూర్ వైపు వెళ్లే వాహనదారులపై ప్రభావం చూపనున్నాయి.
ఆఫీసు టైమ్స్లో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గచ్చిబౌలి జంక్షన్లోకి నేరుగా వెళ్లకుండా, సమీపంలోని అంతర్గత రోడ్లను ఉపయోగించాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే రాడిసన్ హోటల్ పరిసరాలు, ప్రధాన కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.
ఈ సమయంలో వాహనదారులు గూగుల్ మ్యాప్స్ను అనుసరించడంతో పాటు, ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా అప్డేట్స్ను గమనించాలని అధికారులు కోరుతున్నారు. నిర్మాణ పనులు ఏడాది పాటు కొనసాగనున్నందున, ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఈ భారీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు తెలిపారు. అప్పటివరకు ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాలని వాహనదారులను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.