
హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను పారబోయడానికి యత్నించిన ట్రాక్టర్ డ్రైవర్ ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఆదివారం హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్.టి.ఎల్ (FTL) పాయింట్ నంబర్ 425 వద్ద TS07UM9831 అనే నంబర్ కలిగిన ట్రాక్టర్ అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను జలాశయంలోకి వదలడానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. విచారణలో, ట్రాక్టర్ డ్రైవర్/ఓనర్ కుమ్మరి గోపాల్ (40) ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన గోపాల్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని.. అలంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జలమండలి ఈ సందర్బంగా తెలిపింది. జలాశయాల పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే, వెంటనే స్థానిక అధికారులకు లేదా జలమండలి 155313 కస్టమర్ కేర్ నంబర్కు సమాచారం అందించాలని బోర్డు కోరుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..