
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన 2026-27 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి మూడు కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణెకు బుల్లెట్ రైళ్ల కారిడార్ను నిర్మించనుంది. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెకు బుల్లెట్ రైళ్ల కనెక్టివిటీ లభించనుంది. నాలుగు నగరాలను అనుసంధానించేలా కారిడార్లు రానున్నాయి. అయితే ఈ రైళ్ల కోసం శంషాబాద్లోని ఎయిర్ పోర్ట్ దగ్గర ఓఆర్ఆర్ సమీపంలో జంక్షన్ నిర్మించనున్నారు. ఇది బుల్లెట్ రైళ్లకు ఒక హబ్గా పనిచేయనుంది.
ఈ హైస్పీడ్ రైళ్ల జంక్షన్ కోసం శంషాబాద్ మండలంలోని రషీద్ గూడ, చిన్న గొల్కోండ, రషీద్ గూడ ప్రాంతాల్లో భూమిని సేకరిస్తున్నారు. దాదాపు 650 ఎకరాల భూమిని ఇందుకు అధికారులు గుర్తించారు. ఈ భూమిలో ఒక పెద్ద టెర్మినల్ నిర్మించనున్నారు. బహుదూర్ గూడలోని 28,62 సర్వే నెంబర్లో 650 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ జంక్షన్ అత్యంత కీలకంగా పనిచేయనుంది. ఇక హైదరాబాద్ మెట్రోను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో మెట్రోను బుల్లెట్ రైళ్ల కారిడార్తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మెట్రో దిగగానే బుల్లెట్ రైలు ఎక్కవచ్చు. ఇక ఎయిర్ పోర్ట్లోకి దిగాగనే రైలు ఎక్కేలా అనుసంధానించనున్నారు.
హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణె వెళ్లే మూడు కారిడార్ల కోసం బడ్జెట్లో రూ.43,848 కోట్లు అవసరమవుతాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ కారిడార్ల అభివృద్ది కోసం భూసేకరణ చేపడుతోంది. అలైన్ మెంట్ సర్వే, డీపీఆర్ సిద్దం చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ బుల్లెట్ రైళ్ల కారిడార్తో మెట్రో, ఎయిర్ పోర్ట్, రోడ్లను అనుసంధానించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.8 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనుండగా.. ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు మరో 40 కిలోమీటర్ల మెట్రో లైన్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్తో వీటిని అనుసంధానించడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.