
హైదరాబాద్, మే 16: సికింద్రాబాద్లోని జవహర్నగర్ పరిధిలో సంచలనం రేపిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తూ యజమానుల నమ్మకాన్ని సంపాదించిన నేపాలీ జంటే ఈ దోపిడీకి సూత్రధారులుగా మారినట్టు విచారణలో వెలుగుచూసింది. ఈ కేసులో నేపాలీ గ్యాంగ్కు చెందిన కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి (58) ఇంట్లో మమత, రమేశ్ అనే నేపాలీ దంపతులు గృహ సహాయకులుగా పనిచేస్తున్నారు. యజమానుల విశ్వాసాన్ని పూర్తిగా పొందిన ఈ జంట ఈ నెల 12న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఇంటి యజమానులను కోరింది. అయితే అదే వేడుక పేరుతో తమ సహచరులను రహస్యంగా ఇంట్లోకి రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి తర్వాత మమత, రమేశ్ తమ గ్యాంగ్ సభ్యులతో కలిసి ఇంట్లో ఉన్న దంపతులను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు.
నిందితులు సుమారు 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, రూ.30 వేల నగదు, 3 వేల అమెరికన్ డాలర్లను అపహరించి పరారయ్యారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో మమత, రమేశ్తో పాటు సబీనా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ గ్యాంగ్ పనిచేసినట్లు విచారణలో బయటపడింది. ఈ గ్యాంగ్ ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.