Viral Video: ఒరేయ్ అది బైక్ అనుకుంటివా..బస్సు అనుకుంటివా.. ఇలా వెళ్తే ఇక మీ గమ్యస్థానం యమలోకమే!

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ట్రాఫిక్ నిబంధనలను విస్మరిస్తు కొందరు ప్రమాదకర రీతిలో ప్రవర్తించారు. ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున నగరంలోని గగన్‌పహాడ్ నుంచి ఆరాంఘర్ వైపుగా వెళ్తున్న ప్రధాన రహదారిపై ఓ బైక్‌పై ఏకంగా 8 మంది యువకులు ప్రయాణించడం ప్రజల్లో ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఒరేయ్ అది బైక్ అనుకుంటివా..బస్సు అనుకుంటివా.. ఇలా వెళ్తే ఇక మీ గమ్యస్థానం యమలోకమే!
Viral Video

Edited By: Anand T

Updated on: Jun 25, 2025 | 4:55 PM

సాధారణంగా మనం బైక్‌పై వెళ్లాలనుకుంటే ఎం మందిమి వెళ్తాం ఇద్దరం, అంతకు మించితే, అదీ అత్యవసరం అయితే అప్పుడప్పుడూ ముగ్గురు వెళ్తాం..
అది కూడా పోలీసులు చూస్తే ఎక్కడ ట్రిపుల్ రైడింగ్‌ అంటూ ఫైన్‌ వేస్తారోనని భయంభయంతో ప్రయాణిస్తాం.. కానీ ఇక్కడ కొందరు యువకులు అవేవీ లెక్కచేయకుండా, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా, ప్రాణాలకు తెగించే విన్యాసాలు చేశారు. ఒకే బైక్‌పై ఏకంగా 8 మంది గుంపుగా ఎక్కి నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లపై చెక్కర్లు కొట్టారు. ప్రమాదకర స్టంట్స్‌ చేస్తూ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించారు.

అయితే వీరి పిచ్చి చేష్టలను గమనించిన ఓ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్‌ అయి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్.. ఆ వీడియోను పరిశీలించి.. అందులో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. బైక్‌ యజమానితో పాటు బైక్‌పై ఉన్న మొత్తం 8 మందిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ నిబంధనలు కావాలని అతిక్రమించిన వారిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు.

బైక్‌పై 8 మంది యువకుల సవారీ వీడియో

పోలీసులు దీనిపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో.. యువత ఈ తరహా ప్రవర్తనతో తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెట్టే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం ప్రమాదాలకు దారి తీస్తుందని. అంతేకాదు ఇలాంటి స్టంట్స్ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్‌ కోసం, ఫ్రెండ్స్‌తో సరదాకోసం స్టంట్స్‌ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయి హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..