
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ శుభవార్త. త్వరలో మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. నిల్చోని ప్రయాణం చేసేవారికి ఊరట కలిగించేలా మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్లల్లో అదనపు కోచ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రద్దీ సమయాల్లో నిల్చోని ప్రయాణం చేసేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో ఎక్కువమంది కూర్చోని సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఎప్పటినుంచో అదనపు కోచ్ల ఏర్పాటుకు మెట్రో సన్నాహాలు చేస్తుండగా.. ఇప్పుడు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెట్రోలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుండటం, పీక్ ఆవర్స్లో తోపులాటలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల తాకిడి రోజురోజుకు పెరుగుతుండగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లలోని కోచ్లు ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అదనపు కోచ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫేజ్ 1లో అదనపు కోచ్ల ఏర్పాటుకు ముందడుగు వేసింది. త్వరలోనే ఈ అదనపు కోచ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఫేజ్ 1 కారిడార్లో తిరుగుతున్న రైళ్లల్లో ఏర్పాటు చేయనుంది. ఫేజ్ 1 కారిడార్ 69 కిలోమీటర్ల మేర ఉంది. ఈ ఫేజ్లోని రైళ్లు ప్రస్తుతం మూడు కోచ్లు నడుస్తున్నాయి. అమీర్ పేట, రాయదుర్గం, హైటెక్ సిటీ, మియాపూర్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. హైటెక్ సిటీ వైపు వెళ్లే రూట్లో మరింత రద్దీ పెరుగుతోంది. దీంతో కొత్త కోచ్ల కొనుగోలు కోసం తయారీదారులతో మెట్రో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
అటు మెట్రో స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. స్టేషన్ల వెలుపల రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం టీజీఎస్ఆర్టీసీ, రవాణాశాఖతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెట్ర స్టేషన్లకు అనుసంధానంగా స్కైవాక్లు, రద్దీ నియంత్రణకు వినూత్న వ్యూహలు అమలు చేసేందుకు సిద్దమయ్యారు.హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్స్లను కలుపుతూ పబ్లిక్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారయంత్రాంగం తెలిపింది.