స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లి హైదరాబాద్ దంపతుల అదృశ్యం.. మిస్టరీగా మిస్సింగ్!

స్విట్జర్లాండ్‌కు వెళ్లిన హైదరాబాద్ దంపతులు అదృశ్యమవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.50 కోట్ల పెట్టుబడుల ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతోంది. జూన్‌ 22న విదేశాలకు వెళ్లిన ఈ దంపతులు జూలై 8 వరకు కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగించగా, ఆ తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో ఆందోళన నెలకొంది..

స్విట్జర్లాండ్ ట్రిప్‌కి వెళ్లి హైదరాబాద్ దంపతుల అదృశ్యం.. మిస్టరీగా మిస్సింగ్!
Hyderabad Businessman And Wife Missing In Switzerland

Updated on: Jul 12, 2026 | 8:22 AM

హైదరాబాద్, జులై 12: దాదాపు మూడు వారాల క్రితం స్విట్జర్లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త, ఆయన భార్య ఊహించని రీతిలో అదృశ్యమయ్యాడు. ఇదే సమయంలో వారు పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించి దేశం విడిచి వెళ్లి ఉండవచ్చనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన దంపతులు పబ్బా చంద్రశేఖర్‌ (51), ఆయన భార్య స్వప్న (42). చంద్రశేఖర్‌ వ్యాపారవేత్త కాగా, స్వప్న గృహిణి. వీరు జూన్‌ 22న స్విట్జర్లాండ్‌కు విహారయాత్ర కోసం వెళ్లినట్లు వారి కుమార్తె శ్రేయ తెలిపింది. ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగించినప్పటికీ, జూలై 8 తర్వాత నుంచి వారితో ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్‌ చేసినా, వారి మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉండటం లేదా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన వారి కుమార్తె శ్రేయ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దంపతులు స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ప్రయాణ వివరాలు, ఇమ్మిగ్రేషన్‌ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వారు నిజంగా స్విట్జర్లాండ్‌లోకి ప్రవేశించారా లేదా అన్న విషయాన్ని కూడా నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో గత కొన్ని సంవత్సరాలుగా చంద్రశేఖర్‌ దంపతులు 60 మందికి పైగా వ్యక్తుల నుంచి సుమారు రూ.50 కోట్లు సేకరించినట్లు వచ్చిన ఆరోపణలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వ్యక్తిగత, వ్యాపార అవసరాలను చూపిస్తూ అధిక లాభాలు అందిస్తామని హామీ ఇచ్చి ఈ నిధులను సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఇప్పటివరకు మోసం కేసుకు సంబంధించి ఎలాంటి అధికారిక అభియోగాలను పోలీసులు నమోదు చేయలేదు. మిస్సింగ్‌ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, స్వచ్ఛందంగా అదృశ్యమవడం నుంచి ఆర్థిక మోసం వరకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దంపతుల కదలికలు లేదా ఆచూకీపై సమాచారం ఉన్నవారు ముందుకు వచ్చి పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us