
రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గిస్తూ స్థానిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించే నిర్ణయం తీసుకుంది. రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. అయితే రాష్ట్ర అవసరాలు దాదాపు 26 లక్షల టన్నులు ఉన్న నేపథ్యంలో, మరిన్ని 12.68 లక్షల టన్నుల ఉత్పత్తి అవసరం ఉన్నట్టు వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే వెల్లడించింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రతి ఏడాది 10 వేల ఎకరాల్లో అదనపు సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉద్యానశాఖ అంచనా ప్రకారం ఎకరానికి విత్తనాలు, నారు, ఎరువులు, పురుగుమందులు, పోషక యాజమాన్యం వంటి ఖర్చులు కలిపి రూ.24,000 వరకూ ఉంటాయి. అందులో 40% భాగాన్ని సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులకు రూ.9,600 మద్దతు లభిస్తుంది. ఒక్కో రైతు గరిష్ఠంగా 2.5 ఎకరాల వరకు ఈ సబ్సిడీ పొందవచ్చు. టమాట, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ వంటి పంటలు వేసే రైతులు స్థానిక ఉద్యానశాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన తర్వాత సాగు ప్రారంభించిన వెంటనే ఉద్యానశాఖ గుర్తించిన నర్సరీల నుంచి నారు–విత్తనాలు కొనుగోలు చేస్తే, వారికి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమ చేస్తారు.
సిద్దిపేట ములుగు, హైదరాబాద్ జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీలు ఈ ప్రాజెక్ట్ కోసం నాట్లు సిద్ధం చేస్తున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తుంది. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెంచి మార్కెట్లలో ధరలను స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రోత్సాహక పథకం కీలకమవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.