Hyderabad: తాగునీటితో బండి కడుగుతున్నారా.? ఫైన్ కట్టాల్సిందే.. ఎంతో తెల్సా

హైదరాబాద్ జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటి.? జలమండలి అధికారులు ఎంత మేరకు జరిమానా విధించారో ఇప్పుడు తెలుసుకుందామా..

Hyderabad: తాగునీటితో బండి కడుగుతున్నారా.? ఫైన్ కట్టాల్సిందే.. ఎంతో తెల్సా
Hyderabad

Updated on: Mar 06, 2025 | 8:11 AM

హైదరాబాద్ జలమండలి సరఫరా చేసే తాగునీటిని వేరే అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి.. జలమండలి అధికారులు భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన స్థానిక జూబ్లీ హిల్స్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా రోడ్ నెం. 78లో నీరు లీకేజీ అయినట్టు ఎండీ గమనించారు. ఆ వెంటనే స్థానిక జీఎంను లీకేజీకి గల కారణాలను ఆరా తియ్యమని ఆదేశించారు. దీంతో ఓ అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్‌తో వెళ్లి పరిశీలించారు. లీకేజీ ఎక్కడ అయ్యిందా అని కొంతదూరం వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే తాగునీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం అధికారులు ఎండీకి విన్నవించారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని సూచించారు. అంతేకాకుండా అతనికి నోటీసులు అందించి, జరిమానా విధించాలని సంబంధిత జనరల్ మేనేజర్‌ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని ఎండీ తెలిపారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూరు ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ అంతటా సరఫరా చేస్తోంది. కాబట్టి నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా.. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడదని విజ్ఞప్తి చేస్తోంది.

జలమండలి జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us