కరోనా వైరస్పై ప్రపంచం చేస్తున్న పోరులో ముందు వరుసలో ఉన్న జర్నలిస్ట్ల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా అప్డేట్స్పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ జర్నలిస్ట్లు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని, అలాంటి వారియర్స్ కరోనా బారిన పడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఈటెలను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో జర్నలిస్ట్లు పడుతున్న ఇబ్బందులను వారు మంత్రికి వివరించారు.
ఈ నేపథ్యంలో ఈటెల మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా మంది జర్నలిస్ట్లకు పరీక్షలు నిర్వహించామని ఈటెల అన్నారు. అంతేకాదు అవసరమైన ప్రతి జర్నలిస్ట్కి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే పాజిటివ్ వచ్చిన జర్నలిస్ట్లకు మెరుగైన వైద్యం అందిస్తామని ఈటెల హామీ ఇచ్చారు. కాగా తెలంగాణలో కరోనా బారిన పడిన ఓ ఛానెల్ క్రైమ్ జర్నలిస్ట్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై సీఎం కేసీఆర్ సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Read This Story Also: అనారోగ్య లక్షణాలు లేకుంటే.. ఆసుపత్రి నుంచి.. హోం క్వారంటైన్కు..