జనరల్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ… జనం నాడి పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది తెలుగురాష్ట్రాల రాజకీయం. ఓవైపు ఎన్డీఏ.. మరోవైపు కాంగ్రెస్, రిజర్వేషన్లకు సంబంధించి మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇక వనరుల్లో మొదటి ప్రాధాన్యత ముస్లింలకే అన్న నాటి ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చ రచ్చగా మారాయి. ఢిల్లీ మొదలు గల్లీ దాకా.. రిజర్వేషన్ల అంశం పొలిటికల్గా సెగరేపుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం… ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. బీసీలకు తగ్గించి.. మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ మొదలు.. తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగురాష్ట్రాలను ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అటు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా చర్చకు పెడుతోంది. ఆర్ఎస్ఎస్ విధానమే రిజర్వేషన్లు రద్దు అంటోంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటోంది. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు ఉండాలా? వద్దా అనే అంశంపై రిఫరెండమని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ కామెంట్లు ఏపీలో కాక రేపుతున్నాయి. అక్కడ ఎన్డీయే కూటమిని ఇరుకునపెడుతోంది. సెక్యులర్ పార్టీగా మైనార్టీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని.. ఈ విషయంలో టీడీపీ-జనసేన వైఖరి ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ. ముస్లింలకు అదనంగానే కోటా ఉందని..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగ్గినట్టు ఎలా చెబుతారని బీజేపీని ప్రశ్నిస్తోంది వైసీపీ. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే రిజర్వేషన్ల అంశం.. ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది. మరి, రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్లో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.