Hyderabad Metro: ప్రయాణికులకు అలెర్ట్.. మెట్రో టైమింగ్స్ మారుతున్నాయ్.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. నగరంలో ప్రయాణికుల రద్దీని దఈష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణ సమయాల్లో మార్పులను చేసింది. తాజాగా ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు మెట్రో వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే సమయంలో మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైలు సమయాలను పొడిగిస్తున్నట్టుగా తెలిపింది. దీంతో పాటు మరిన్ని కొత్త సేవలపైనా క్లారిటీ ఇచ్చింది. ఇక మారనున్న సమయాలు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad Metro: ప్రయాణికులకు అలెర్ట్.. మెట్రో టైమింగ్స్ మారుతున్నాయ్.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..
Hyderabad Metro Timing Changes

Updated on: Mar 29, 2025 | 6:59 PM

హైదరాబాద్ నగర రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ తాజా ప్రకటన చేసింది. ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పించింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, సులభంగా ప్రయాణించేందుకు వీలుగా డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైలు సమయాలను మెట్రో పొడిగించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, ఆదివారాల్లో మొదటి రైలు ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది.

విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్

విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌ను మరో ఏడాది పొడిగించింది. 20 ట్రిప్పులు చెల్లిస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుందని మెట్రో యాజమాన్యం తెలిపింది.

కొత్త టి-సవారీ మొబైల్ యాప్, వెబ్‌సైట్

ప్రయాణికుల కోసం కొత్త టి-సవారీ మొబైల్ అప్లికేషన్‌ను, నూతనంగా రూపొందించిన హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇతర ఆఫర్లు

సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ డిస్కౌంట్ ఆఫర్ మార్చి 31, 2025తో ముగుస్తాయి.

ప్రయాణికులకు మరింత చేరువవుతాం..

హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, నగర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

సౌకర్యవంతమైన సేవలే లక్ష్యం..

ఎల్&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈఓ కెవిబి రెడ్డి మాట్లాడుతూ, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. టి-సవారీ యాప్, కొత్త వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్ మెట్రోను డిజిటల్‌గా మరింత అభివృద్ధి చేశామని చెప్పారు.