
హైడ్రా విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కబ్జాదారులు కోర్టును తప్పుదారి పట్టించారని.. సోమేష్ కుమార్పై గతంలో 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. గతంలో కోర్టు ధిక్కరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏ అధికారిని ఎక్కడ ఉంచాలనేది ప్రభుత్వ ఇష్టం.. హైడ్రా పనితీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) వ్యవస్థపై ఎలాంటి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైడ్రా పనితీరుపై వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించిన ఆయన, ఆక్రమణలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెచ్చిన సంస్కరణల్లో హైడ్రా ఒకటి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేద, ధనిక అనే తేడా లేకుండా చెరువులు, పార్కులు, నాలాలను ఆక్రమించిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. గండిపేట, బతుకమ్మ కుంటలు, ఎన్ కన్వెన్షన్ వంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ బడా బాబులే ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు. డబ్బులు వెచ్చించి సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగలు, కబ్జాదారులు, బీఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను తొలగించాలని కోరుతున్నారని ఆరోపించారు.
హైడ్రా కార్యాచరణపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని.. హైకోర్టు ఆర్డర్స్ పరిశీలించిన తర్వాత మళ్లీ స్పందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా పై హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించి, తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏ ఉద్యోగిని ఎక్కడ నియమించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారమని తెలిపారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇకపై ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ సంవత్సరమే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఏడాదికి రూ. 2,200 కోట్లు కేటాయించి, నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలోనే రూ. 8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ గురించి ప్రశ్నిస్తున్న ఆర్ కృష్ణయ్య, రామ చంద్రరావు మొదట ఏపీలో పెండింగ్ లో ఉన్న పదివేల కోట్ల బకాయిల గురించి ప్రశ్నించాలని..అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చేసి అప్పుడు తెలంగాణలో ప్రశ్నించాలన్నారు.. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో ఇకపై పేపర్ లీకులు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.