బడికొచ్చి అదృశ్యమైన ఐదుగురు బాలికలు.. 5 గంటల తర్వాత తిరిగి ప్రత్యక్షం! MLA వార్నింగ్‌

హైదరాబాద్‌ విజయనగర్‌కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఎనిమిదో తరగతి విద్యార్థినులు బ్రేక్‌ సమయంలో పుస్తకాల బ్యాగులు తరగతి గదిలోనే ఉంచి బయటికి వెళ్లడంతో కలకలం రేగింది. ఉదయం 11 గంటలకు వెళ్లిన వారు సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చారు..

బడికొచ్చి అదృశ్యమైన ఐదుగురు బాలికలు.. 5 గంటల తర్వాత తిరిగి ప్రత్యక్షం! MLA వార్నింగ్‌
Five Class 8 Girls Go Missing From Hyderabad Govt School

Updated on: Sep 16, 2026 | 6:11 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌ విజయనగర్‌కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలకలం రేగింది. పాఠశాలకు వచ్చిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు బ్రేక్‌ సమయంలో బయటికి వెళ్లి సుమారు ఐదు గంటల పాటు కనిపించకుండా పోయారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సాయంత్రం 4 గంటల సమయంలో విద్యార్థినులు తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఈ స్కూల్‌లో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చారు. హాజరు ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. అనంతరం బ్రేక్‌ సమయంలో తమ పుస్తకాల బ్యాగులను తరగతి గదిలోనే ఉంచి బయటికి వెళ్లిపోయారు. అయితే బ్రేక్‌ అనంతరం విద్యార్థినులు తరగతి గదిలో కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. వెంటనే వారి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 11 గంటల సమయంలో పాఠశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి ప్రత్యక్షమయ్యారు. తాము ఐమ్యాక్స్‌ థియేటర్‌కు సినిమాకు వెళ్లినట్లు విద్యార్థినులు తెలిపారు. దీంతో వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే

ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌ పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు పాఠశాల నుంచి బయటికి వెళ్లిన సమయంలో ఉపాధ్యాయులు స్టాఫ్‌రూంలో ఉన్నారని తోటి విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించినట్లు సమాచారం. పాఠశాలలో వాచ్‌మెన్‌ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వాచ్‌మెన్‌ను నియమించుకోవాలని డిప్యూటీ డీఈవో బాలునాయక్‌, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి, ఇన్‌ఛార్జి సరితకు సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యార్థినులు సురక్షితంగా తిరిగి రావడంతో అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. పాఠశాల నుంచి విద్యార్థులు అనుమతి లేకుండా బయటికి వెళ్లకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us