నాణ్యతతో కూడిన పాత అసెంబ్లీ, సెక్రటేరియట్లను కూల్చివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కొత్త భవనాల నిర్మాణం నేపథ్యంలో ఛలే సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాత సెక్రటేరియట్లో కూలగొడుతున్న భవనాలను పరిశీలించేందుకు వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దీన్ని తప్పుబట్టిన భట్టి.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని వాటి సంగతిని ముందుగా చూడాలని సూచించారు. 1985లో ప్రారంభమైన నాటి సెక్రటేరియట్ భవనం అన్ని వసతులతో ఉందన్నారు. శాసనసభ ప్రాంగణం రాష్ట్ర ప్రజలందరిదని.. కేసీఆర్ కుటుంబసభ్యులకు చెందింది కాదని ఆయన మండిపడ్డారు. కొత్త భవనానికి సంబంధించి శాసనసభలోని ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం ఎలాంటి సమావేశం నిర్వహించలేదని భట్టి విమర్శించారు.