
సాంప్రదాయ భక్తి సంగీతానికి ఆధునిక బీట్స్ను జోడిస్తూ హైదరాబాద్లో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమవుతోంది. “ది కాన్ఫ్లూయెన్స్ – రిథమ్ ఆఫ్ భక్తి” పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. భజనలను కేవలం ఆలయాలకే పరిమితం చేయకుండా.. యువతకు కనెక్ట్ అయ్యేలా భజన్ క్లబ్బింగ్ కాన్సెప్ట్ను తీసుకువస్తున్నారు నిర్వాహకులు. సుమారు 15 వేల మంది యువత పాల్గొనేలా ఈ భారీ కన్సర్ట్ను ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం యువతలో పెరుగుతున్న డ్రగ్స్, చెడు వ్యసనాలు, నైట్ పార్టీ కల్చర్ ప్రభావం నుంచి వారిని దూరంగా ఉంచి.. ఆధ్యాత్మికత వైపు మళ్లించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి.. కానీ అది భక్తి ద్వారా రావాలి అన్నదే ఈ ఈవెంట్ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు.
ఢిల్లీకి చెందిన లీలా రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో శివతాండవం, భక్తి గీతాలు, లైవ్ మ్యూజిక్, డీజే బీట్స్ కలయికగా ప్రత్యేక ప్రదర్శనలు ఉండనున్నాయి. భక్తి, సంగీతం, డ్యాన్స్ అన్నీ ఒకే వేదికపై కలిసేలా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో మే 23 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది.
ఉచిత ప్రవేశం
ప్రవేశం ఉచితం కాగా.. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు. భజనలకు రాక్ మ్యూజిక్ టచ్, క్లబ్ ఎనర్జీ, ఆధ్యాత్మిక వాతావరణం కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని నగర యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
పోస్ట్ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.