Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!

వంటగ్యాస్‌ కనెక్షన్‌ల విషయంలో జరుగుతోన్న మోసాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేశారు హైదరాబాద్‌ CP సజ్జనార్‌. గ్యాస్ కనెక్షన్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపినట్టు తెలిపారు. మీ మొబైల్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింక్‌లు క్లిక్ చేసి, వారు పంపిన ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ బ్యాంకు ఖాతా క్షణాల్లో ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరించారు.

Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!
Sajjanar Cyber Warning

Updated on: Mar 14, 2026 | 10:18 PM

దేశంలో గ్యాస్ కొతర నేపథ్యంలో కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఒక చిన్న యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు, మీ కష్టార్జితం మొత్తం నేరగాళ్ల పాలవుతుంద సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన తాజా ఘటనే ఇందుకు నిదర్శనం అన్నారు. మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారని.. తాము ప్రముఖ గ్యాస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, గ్యాస్ సిలిండర్ సమాచారాన్ని వెంటనే అప్‌డేట్ చేయాలని నమ్మించారు. ఆ తర్వాత వాట్సాప్‌లో ఒక ఏపీకే ఫైల్ పంపించి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసి, అందులో ఉన్న ఫారం నింపాలని సూచించారు. ఆ మహిళలు వారు చెప్పినట్లే ఆ ఫైల్ ఇన్‌స్టాల్ చేసి వివరాలు నమోదు చేయగానే.. వారి బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు మాయం అయ్యాయి.

ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. నేరగాళ్లు పంపే ఏపీకే ఫైల్స్ చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయగానే, మన మొబైల్ నియంత్రణ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, బ్యాంకు మెసేజ్‌లు అన్నీ వారికి నేరుగా చేరిపోతాయని. దీని ద్వారా తెలియకుండానే ఖాతాల్లోని డబ్బును కాజేస్తారన్నారు. గ్యాస్ ఏజెన్సీలు గానీ, ప్రభుత్వ సంస్థలు గానీ వివరాలు నమోదు చేయడానికి ఎప్పుడూ ఇలాంటి థర్డ్-పార్టీ ఫైల్స్ పంపవని ప్రజలు గ్రహించాలన్నారు. అపరిచితులు పంపే యాప్స్‌ను అసలే ఇన్‌స్టాల్ చేసుకోవద్దని హెచ్చరించారు.

గ్యాస్ బుకింగ్ లేదా కేవైసీ కోసం ఎల్లప్పుడూ అధికారిక యాప్స్, వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని.. ఏదైనా అనుమానం వస్తే నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుకు వెళ్లి సంప్రదించడం ఉత్తమం అన్నారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని.. సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ఆన్‌లైన్ మోసాలకు అప్రమత్తతే అసలైన విరుగుడన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us