
పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్కు చెంచిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్ టెక్ కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈవీ వాహనాలు కొనే తమ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. గ్రీన్ వర్క్ప్లేస్ దిశగా అడుగులు వేస్తూ ఉద్యోగుల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకం అందించనుంది.
పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయాల వినియోగం పెరగాలని సంస్థ భావిస్తోంది. ఉద్యోగులు స్వచ్ఛమైన రవాణా మార్గాల వైపు అడుగులు వేయాలని సూచిస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కార్ పూలింగ్, ప్రజా రవాణా వినియోగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సంస్థ అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ ఫణిరాజ్ జలిగామ మాట్లాడుతూ.. ఇంధన వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక ప్రయోజనాలకు కూడా తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు. ప్రధాని విజన్కు అనుగుణంగా సంస్థలో ప్రత్యేకంగా ‘గ్రీన్ పాలసీ’ లేదా ‘ఈవీ పాలసీ’ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఇంధన పొదుపు, పర్యావరణహిత రవాణాను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.