
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత బాణాల రామ్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని తన ఫామ్హౌస్లో ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
రామ్రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్లోని మణికొండలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని డెవలప్మెంట్ కోసం తీసుకుని వెంచర్ చేపట్టినట్లు సమాచారం. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదాలు, లిటిగేషన్ల కారణంగా వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు తెలుస్తోంది. వివాదాలను పరిష్కరించేందుకు భారీగా అప్పులు చేసినట్లు, మరోవైపు భూ యజమానులతో కూడా సమస్యలు తలెత్తినట్లు ప్రాథమిక సమాచారం. వెంచర్ ఆలస్యం కావడంతో ఆర్థిక భారం పెరిగి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
రామ్రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రామ్రెడ్డి ఆత్మహత్యకు అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..