
దొంగతనం సమయంలో చిన్న పొరపాటు చేసినా.. దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ కూడా అదే జరిగింది. మూడేళ్ల క్రితం ఎత్తుకెళ్లిన చీరను కట్టుకున్నందుకు ఓ మహిళ కటకటాల పాలయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బండ్లగూడజాగీర్ వినాయక్నగర్లో ఎం.యాదయ్య ప్రభుత్వ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి నివపిస్తున్నారు. అయితే 2023 సెప్టెంబర్ 16న పిల్లలకు అనారోగ్యం దృష్ట్యా అతను మూడు రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది.
హాస్పిటల్కు వెళ్తే.. ఇళ్లు గుల్ల
అయితే ఆయన పిల్లలకు వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చే సరికి ఇంట్లోని బీరువాలో ఉన్న 9 తులాల బంగారం, రూ.2.50 లక్షల డబ్బు, పట్టుచీర కనిపించలేదు. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన యాదయ్య స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కానీ ఎన్ని రోజులకు అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు సైతం కేసును క్లోజ్ చేశారు.
మూడేళ్ల తర్వాత ట్విస్ట్
కట్చేస్తే మూడేళ్ల తర్వాత అంటే ప్రస్తుతం బాధితుడు యాదయ్య భార్య తమకు తెలిసిన వారు ఫంక్షన్ చేస్తే వెళ్లింది. అయితే అదే పంక్షన్కు స్థానికంగా నివసించే స్వప్న అనే మహిళ పట్టు చీర కట్టుకొని వచ్చింది. అయితే ఆమె కట్టుకున్న పట్టు చీరను గమనించిన యాదయ్య భార్య.. అది తమ ఇంట్లో చోరీకి గురైన చీరేనని గుర్తించింది.
పట్టించిన పట్టుచీర
వెంటనే అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన రీతిలో విచారించగా అసలైన విషయం వెలుగు చూసింది. వారే దొంగతనం చేసినట్టు అంగీకరించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె నుంచి 8.7 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.