Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మెట్రో నిర్వహణలో కొత్త మార్పులు!

హైదరాబాద్ మెట్రో రైలు టేకోవర్ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ముందే ప్రాజెక్టును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని సర్కార్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ అంశాలపై సమగ్ర అధ్యయనాలు పూర్తయ్యాయి. సంబంధిత నివేదికలు సిద్ధంగా ఉండగా, ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Hyderabad Metro: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మెట్రో నిర్వహణలో కొత్త మార్పులు!
Hyderabad Metro Takeover

Edited By:

Updated on: Feb 21, 2026 | 4:40 PM

మెట్రో టేకోవర్‌ను సాంకేతికంగా విశ్లేషించేందుకు ప్రభుత్వం టెక్నికల్ కన్సల్టెంట్‌గా Delhi Metro Rail Corporation ను నియమించింది. దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టుల అమలు, నిర్వహణలో అనుభవం ఉన్న ఈ సంస్థ ప్రాజెక్టు పనితీరు, భవిష్యత్ విస్తరణ, నిర్వహణ సామర్థ్యాలపై నివేదిక సమర్పించింది. అదే సమయంలో ఆర్థిక, న్యాయ అంశాల పరిశీలన కోసం IDBI Bank ను ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్‌గా నియమించారు. ఎల్ అండ్ టీ సంస్థకు సంబంధించిన బకాయిలు, ఒప్పంద నిబంధనలు, అప్పులు, ఆర్థిక బాధ్యతలపై విశ్లేషణ చేసి పూర్తి స్థాయి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు.

ప్రస్తుతం హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. బకాయిల చెల్లింపులు, ఒప్పందాల పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ నిర్వహణ విధానంపై స్పష్టతకు వచ్చే దశలో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే టేకోవర్ ప్రక్రియ వేగవంతం కానుంది.

మార్చి 31లోగా మొత్తం స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. టేకోవర్ అనంతరం మెట్రో సేవల విస్తరణ, కొత్త కారిడార్ల ప్రణాళిక, చార్జీల విధానం, నిర్వహణలో మార్పులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వ నియంత్రణలోకి వస్తే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు మరింత వేగం అందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టుపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కేబినెట్ తుది నిర్ణయం తర్వాత మెట్రో భవిష్యత్ దిశపై స్పష్టత రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us