
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన నహీద్ కౌసర్ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నహీద్ కౌసర్ అదే ప్రాంతానికి చెందిన ఫర్వేజ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ కలసి జీవించడమే కాకుండా ఉమ్మడిగా హ్యాండ్బ్యాగుల వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఇటీవలే వీరిద్దరూ కలిసి తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా కాటేదాన్లోని గణేష్నగర్లో ఒక షట్టర్ను అద్దెకు తీసుకుని, కొత్తగా బ్యాగుల తయారీని ప్రారంభించేందుకు అవసరమైన యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే, కొత్త వ్యాపారం ప్రారంభించే క్రమంలో గురువారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్పర్థలు రావడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి వివాదం తీవ్రమైంది.
గొడవ అనంతరం ఫర్వేజ్ సిగరెట్లు కొనడానికి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత, రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి నహీద్ కౌసర్ గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ఫర్వేజ్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.