Gold Man: గోల్డ్మ్యాన్ సూర్యాభాయ్కు బిగ్ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు.. అసలు మ్యాటరేంటంటే?
గోల్డ్ మ్యాన్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన పుల్లపు సురేష్ కుమార్ అలిసాయ్ సూర్యభాయ్కు ఊహించని షాక్ తగిలింది. అత్తాపూర్లోని పోలీస్ స్టేషన్లో సూర్యభాయ్పై కేసు నమోదైంది. తక్కువ ధరకే విదేశీ గోల్డ్ ఇప్పిస్తానని రూ.30లక్షలు తీసుకొని మోసం చేశాడనే బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా సూర్యాభాయ్ను అరెస్ట్ చేశారు.

గత కొన్ని రోజులుగా ‘గోల్డ్ మ్యాన్’ పేరుతో సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన వ్యక్తి పాతబస్తీకి చెందిన సురేష్ కుమార్ అలియాస్ సూర్యభాయ్. వంటిపై భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తనను తాను గోల్డ్ మ్యాన్గా పరిచయం చేసుకున్న సూర్యభాయ్కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి సూర్యభాయ్ రూ. 30 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ బంగారం ఇవ్వకపోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు అతని ఇంటికెళ్లి నిలదీశాడు. దాంతో సూర్యభాయ్ రూ. 20 లక్షల నగదు, 3 ఐఫోన్లు ఇచ్చి పంపాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బాధితులను బెదిరించి, తాను ఇచ్చిన ఆ 3 ఫోన్లను బలవంతంగా లాక్కెళ్లాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాకుండా, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు అత్యంత సన్నిహితుడినని నమ్మించి సూర్యభాయ్ ఈ మోసానికి పాల్పడినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక:
ఈ ఘటన నేపథ్యంలో నగర వాసులకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ప్రజలు ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
