
సైబర్ నేరాలు ఎక్కడి నుండో కాదు.. తెలంగాణ నుండే అధిక మంది నేరస్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్పై పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లు ఫలితాలిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్లలో భాగంగా మొత్తం 20 మంది నేరస్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ ముఠా సభ్యులు సైబర్ మోసాల ద్వారా ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. బాధితులకు న్యాయం చేయడంలో భాగంగా పోలీసులు సుమారు రూ.1.59 కోట్ల మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేయించడంలో కీలక పాత్ర పోషించారు. మార్చి నెలలో నిర్వహించిన ఈ ఆపరేషన్లలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి మొత్తం 3,081 ఫిర్యాదులు నేషనల్ సైబర్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ (NCRP) ద్వారా అందగా.. అందులో 276 FIRలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కొన్ని కేసుల్లో బాధితులకు రూ.95.99 లక్షలు రికవరీ చేసి అందజేశారు. ఈ కేసుల్లో పెట్టుబడి మోసం, ట్రేడింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా మోసం, క్రెడిట్ కార్డ్ మోసం, ఇంపర్సనేషన్, ఆన్లైన్ గేమింగ్, మ్యాట్రిమోనీ, జాబ్ ఫ్రాడ్ వంటి పలు రకాల నేరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యువతను లక్ష్యంగా చేసుకుని సులభంగా డబ్బు వస్తుందనే ఆశ చూపించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు రూ.6.5 లక్షల నగదు, 14 మొబైల్ ఫోన్లు, నాలుగు ల్యాప్టాప్లు, చెక్ బుక్స్, కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై నడుస్తున్న 129 ఫేక్ ప్రొఫైళ్లను గుర్తించి తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ అకౌంట్ల ద్వారా 494కు పైగా పేడ్ అడ్వర్టైజ్మెంట్లు రన్ చేస్తూ యూజర్లను మోసం చేసినట్లు వెల్లడైంది.
ఇక బాధితులకు సత్వర సహాయం అందించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 1,730 కాల్స్ ద్వారా బాధితులతో సంప్రదించి మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా 262 జీరో FIRలు నమోదు చేసి కేసులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఆఫర్లకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.