
తెలంగాణలో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (RDO) కె. వంశీమోహన్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు గురువారం (మే 21) తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో భారీ సోదాలు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, వంశీమోహన్తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీ మోహన్.. తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున ప్రభుత్వ భూములను కాజేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ నిఘా పెట్టగా, షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
వంశీ మోహన్ అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం పరిధిలో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. సదరు భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత దాన్ని ఓ ప్రముఖ రియల్టర్కు దారాదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికి ప్రతిఫలంగా సదరు రియల్టర్ నుంచి వంశీ మోహన్ కుటుంబ సభ్యుల పేరిట 10 విలువైన ప్లాట్లను ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో పొందినట్లు ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది.
హైదరాబాద్ మహానగరంతోపాటు పలు ప్రాంతాల్లో వంశీ మోహన్కు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా లభించిన ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ, అందుకు ప్రతిఫలంగా కోట్లాది రూపాయల లంచాలు, ప్లాట్లను వెనకేశారనే ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ సోదాల పర్వం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత గల డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారే ఇలా అక్రమాలకు తెరలేపడంపై ఏసీబీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..