పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట.. మరణంలో ఒక్కటయ్యారు ! ఏం జరిగిందో తెలిస్తే..

ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ జంటను విధి వంచించింది. ఒకరు ఉపాధి కోసం వెళ్ళిన సుదూర తీరంలో ప్రాణాలు వదిలితే, ఆ వియోగాన్ని భరించలేక మరొకరు స్వగ్రామంలోనే తనువు చాలించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది. గల్ఫ్‌లో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తట్టుకోలేక ఇక్కడ ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట..  మరణంలో ఒక్కటయ్యారు ! ఏం జరిగిందో తెలిస్తే..
Love Story Tragedy

Edited By:

Updated on: May 05, 2026 | 10:47 AM

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు లక్ష్మి–రంగయ్య దంపతుల కూతురు శృతి (19), పాత దామరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మక్కల పోషన్న–లక్ష్మీ దంపతుల కుమారుడు సాయికుమార్ (22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు గౌరవించి, ఏడు నెలల క్రితమే నిశ్చితార్థం కూడా జరిపించారు. త్వరలోనే వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు, పెళ్లి ఖర్చుల కోసం సాయికుమార్ గల్ఫ్ దేశానికి వెళ్లాడు.

అయితే, గల్ఫ్‌లో సాయికుమార్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. అక్కడ సరైన పని లేకపోవడం, పని ఒత్తిడి లేదా ఇతర వేధింపుల కారణంగా మనస్థాపానికి గురైన సాయికుమార్ శుక్రవారం అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు చేరింది.

కళ్లముందే పెళ్లి కలలు కన్న వ్యక్తి ఇక లేడన్న వార్త శృతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తాను ప్రేమించిన సాయికుమార్ లేని జీవితం వద్దనుకున్న ఆమె, శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి వేడుకతో సందడిగా ఉండాల్సిన ఆ రెండు ఇళ్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

సాయికుమార్ మరణానికి గల్ఫ్‌లో పని సమస్యలతో పాటు, కొందరు కుటుంబ సభ్యుల వేధింపులు కూడా కారణమై ఉండవచ్చని మృతుని తండ్రి, చిన్నాన్న ఆరోపిస్తున్నారు. శృతి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉపాధి కోసం వెళ్లి శవమై రావడం, ఆ బాధతో మరో నిండు ప్రాణం బలికావడం ఆ రెండు గ్రామాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us