
విద్యాబుద్దులు నేర్పి పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేయాల్సిన ఓ సర్కారీ బడిపంతులు ఆ చిన్నారుల ఎదుటే పాడు పనికి పాల్పడ్డాడు. దేవాలయం లాంటి బడిలో యథేచ్చగా మద్యం తాగుతూ స్థానికులకు చిక్కాడు. ఇదేంటని నిలదిస్తే నాకేం తెలియదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.. చివరకు స్థానికులు తమదైన స్టైల్ లో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆమ్లే అనే ప్రాథమికపాఠశాల ఉపాద్యాయుడు.. బడిలోనే మద్యం తాగుతూ స్థానికులకు పట్టుబడ్డాడు. పాఠశాల కొనసాగుతున్న సమయంలోనే ఏంచక్కా మందు విందుతో విద్యార్థుల ను గాలికి వదిలేసి ఎంజాయ్ చేశాడు. సమయానికి ఆ వైపుగా వెళుతున్న స్థానికయువత గుర్తించి ఆ ఉపాధ్యాయుడిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న సునంద అనే ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో.. అదే మండలానికి చెందిన దుగ్నేపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆమ్లే అను ఉపాధ్యాయున్ని డిప్యూటేషన్ పై చర్లపల్లి పాఠశాలకు
పంపించారు అధికారులు. అయితే, రావడం రావడమే ఈ మత్తు సారూ.. ఓ హాప్ బాటిల్ తో స్కూల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కడే తాగితే డౌట్ వస్తుందనుకున్నాడో.. కంపెనీ లేకుంటే కిక్కు ఎక్కదనుకున్నాడో ఏమో కానీ.. ఓ స్థానిక యువకుడిని పిలిపించుకుని స్టప్ తెప్పించుకుని మరీ పాఠశాల కొనసాగుతున్న సమయంలోనే మత్తు దుకాణం తెరిచాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుడు ఆమ్లేను నిలదీశారు. మద్యం సేవిస్తున్న దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరీ విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..