Telangana: అయ్యో దేవుడా ఎంత పనిచేశావయ్యా.. తెల్లవారితే చిట్టితల్లి బర్త్ డే.. అంతలోనే..

| Edited By: Shaik Madar Saheb

Feb 12, 2024 | 5:35 PM

ముద్దు ముద్దు మాటలు ఒలికించే మనుమరాలు అంతలోనే కానరాని లోకానికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగివస్తూ కడసారి చూపునకే పరిమితమయ్యింది. తెల్లవారితే పుట్టినరోజు.. దీంతో ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకను ఎంతో ఘనంగా చేద్దామనుకున్నారు. అకాల మృత్యువు ఆ కన్నతల్లిదండ్రులను పుట్టెడే శోకంలో మిగిలిపోయేలా చేసింది..

Telangana: అయ్యో దేవుడా ఎంత పనిచేశావయ్యా.. తెల్లవారితే చిట్టితల్లి బర్త్ డే.. అంతలోనే..
Crime News
Follow us on

నారాయణపేట జిల్లా, ఫిబ్రవరి 12: ముద్దు ముద్దు మాటలు ఒలికించే మనుమరాలు అంతలోనే కానరాని లోకానికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగివస్తూ కడసారి చూపునకే పరిమితమయ్యింది. తెల్లవారితే పుట్టినరోజు.. దీంతో ఆ చిన్నారి పుట్టిన రోజు వేడుకను ఎంతో ఘనంగా చేద్దామనుకున్నారు. అకాల మృత్యువు ఆ కన్నతల్లిదండ్రులను పుట్టెడే శోకంలో మిగిలిపోయేలా చేసింది.. వివరాల్లోకి వెళితే… నారాయణపేట జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు రమేశ్, క్షితలకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద అమ్మాయి నివేదిత(4)ను మరికల్ లోని అమ్మమ్మ ఇంటికి కొద్దిరోజుల క్రితం పంపించారు. మిగిలిన ఇద్దరు పిల్లలు చిన్నవారు కావడంతో వారి వద్దే ఉంచుకున్నారు. ఇక మనుమరాలు నివేదిత ఇంటికి రావడంతో మరికల్ లో ఉంటున్న వెంకటయ్య దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మనుమరాలు ముద్దు ముద్దు మాటలను చూసి ఎంతో మురిసిపోయారు. ఇటీవలె తిరుపతి ఏడుకొండలవారి దర్శనానికి తీసుకొని వెళ్లి శనివారమే మరికల్ చేరుకున్నారు. ఇక సోమవారం మనుమరాలు పుట్టినరోజు కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇంతలోనే చిన్నారి తల్లి ఫోన్ చేసి పాప జన్మదిన వేడుకలు చిట్యాలలోనే నిర్వహిస్తామని చెప్పడంతో మనుమరాలితో సహా బయలుదేరారు..

కబళించిన మృత్యువు..

ఆదివారం మధ్యాహ్నం మనమరాలిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని కుమార్తె ఇంటికి బయలుదేరారు. తల్లిదండ్రుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఎంతో మురిసిపోయారు. ఇంతలోనే బలియమైన విధి నిర్ణయం ఆ కుటుంబంలో శోకం నింపింది. బొందల్ కుంట స్టేజి సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఘటనలో నివేదిత అక్కడిక్కడే తుదిశ్వాస విడిచింది. తాత వెంకటయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మహబూబ్ నగర్ అస్పత్రికి తరలించారు.

తెల్లవారితే మనమరాలి జన్మదినం కావడంతో అమ్మమ్మ, తాత ఎంతో సంబురపడ్డారు. ముందురోజే నివేదితకు తలపోశారు. కొత్తబట్టలు, చెవికమ్మలు కొన్నారు. కేకు కోసి బర్త్ డే ను ఘనంగా చేద్దామనుకున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో చిన్నారిని మృత్యువు కబలించింది. వృద్ద దంపతుల ఆనందాన్ని చిదిమేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..