Telangana Rains: వానొచ్చె, వరదలు తెచ్చె.. రోడ్లపైనే చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే

|

Jul 22, 2021 | 4:30 PM

చేపలు పట్టాలంటే ఊరి చివరన ఏ చెరువు దగ్గరికో.. కాల్వల దగ్గరికో వెళ్తారు. లేదా పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు.....

Telangana Rains: వానొచ్చె, వరదలు తెచ్చె.. రోడ్లపైనే  చేపల వేట.. ఒక్కోటి కిలోకు పైనే
Fishing On Road
Follow us on

చేపలు పట్టాలంటే ఊరి చివరన ఏ చెరువు దగ్గరికో.. కాల్వల దగ్గరికో వెళ్తారు. లేదా పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ నిర్మల్‌ జిల్లాలో మాత్రం చేపల కోసం జనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నారు. పెద్దగా కష్టపడకుండానే ఈజీగా చేపలు పట్టేసుకుంటున్నారు. పైగా ఆ చేపలు ఒక్కోటి దాదాపు కిలోకు పైగానే బరువున్నాయి.

చూస్తుంటే భలేగా ఉన్నాయి కదా ఈ దృశ్యాలు. అయినా, ఇదేంటి… రోడ్డు మీద ఏంటి? చేపలు పట్టడమేంటి? అనుకుంటున్నారా..? గత వారం రోజులుగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువులు, వాగులకు గండ్లు పడటంతో.. వాటిలోని చేపలు వరదతో కలిసి ఇలా రోడ్లపైకి వచ్చి చేరాయి. రోడ్లపై చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు.

 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుండుగూడెం దగ్గర ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండడానికి గూడు కూడా లేదని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అటు భైంసా ముంపులో చిక్కుకుంది. గడ్డెన్నవాగు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు టౌన్‌ను ముంచెత్తింది. ముఖ్యంగా ఆటోనగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా మారింది. అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతుండడంతో.. భైంసాలోని ఆటోనగర్‌వాసులు కనీసం ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. 60 మంది వరకు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. వరద ఉదృతికి రెస్క్యూ టీం ఇళ్ల వద్దకు చేరుకోలేకపోతుంది. అతి కష్టం మీద జనాల్ని నాటు పడవల్లో ఎక్కించుకున్నప్పటికీ వరద ప్లో  తీవ్రంగా ఉండటంతో రెస్క్యూ హోమ్స్  చేరుకోలేకపోతున్నారు.

 

Also Read: